ఓం రౌత్ చేతిలో 'కలాం' కథ

ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది 'ఆదిపురుష్'. రామాయణం వంటి మహాగ్రంధాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించినా, దర్శకుడు ఓం రౌత్ స్క్రీన్ ప్లే, విజువల్స్, క్యారెక్టర్స్ ప్రెజెంటేషన్ తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ముఖ్యంగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ పాత్ర, డైలాగులు, గ్రాఫిక్స్ అన్నీ నెటిజన్లకు నచ్చక సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత చూపించారు.
'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ తన కొత్త ప్రాజెక్టు 'కలాం'తో మరోసారి హైలైట్ అయ్యాడు. అది కూడా దేశ గర్వకారణమైన శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్. విలక్షణ నటుడు ధనుష్ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాను టి సిరీస్, ఏకె ఎంటర్టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే అధికారిక ప్రకటనతో పాటు ఒక ప్రీ లుక్ కూడా విడుదలైంది.
ఈనేపథ్యంలో డైరెక్టర్ ఓం రౌత్కి సినీ ప్రేమికులు 'ఆదిపురుష్'లో చేసిన తప్పిదాలు 'కలాం' బయోపిక్లో రిపీట్ కాకూడదని విఙ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే 'కలాం' జీవితం ఎన్నో తరాలకు ప్రేరణ ఇచ్చేలా ఉండే మహోన్నతమైనది. ఆయన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, విజ్ఞాన సాధన ఇలాంటివి హృదయానికి హత్తుకునేలా చూపించాల్సిన బాధ్యత ఓం రౌత్ పై ఉంది.
అలాగే ఓం రౌత్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. 'ఆదిపురుష్'కి ముందు బాలగంగాధర్ తిలక్ బయోపిక్ 'లోకమాన్య'తో తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత హిస్టారికల్ డ్రామా 'తానాజీ'తో బాలీవుడ్ లో బడా హిట్ అందుకున్నాడు. ఇప్పుడు 'కలాం'తో మళ్లీ ఓం రౌత్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.
-
Home
-
Menu